నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు

  • బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
  • సౌదీ అరేబియా సూచించిన ‘ఫెంగల్’గా నామకరణం
  • అన్ని పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
  • మూడు రోజుల పాటు గంటకు 75 కి.మీ. వేగంతో గాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేడు తుపానుగా మారే అవకాశం ఉండటంతో ఆ ప్రభావం ఏపీకి కూడా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండ్రోజుల్లో తుపాను ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని తాకి, ఆపై తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపేట్లై, చెన్నై మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా సూచించిన ‘ఫెంగల్’ అనే పేరును ఈ తుపానుకు పెట్టడం జరిగింది.

తుపాను ప్రభావంతో నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే, వచ్చే మూడు రోజులపాటు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, క‌ృష్ణపట్నం పోర్టులకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Cyclone Fengal
Coastal Andhra
Rayalaseema
Andhra Pradesh
Chennai

More Telugu News